సలాం ప్రొద్దుటూరు:
భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఆదివారం ప్రొద్దుటూరులో కడప జిల్లా స్థాయి అండర్-18, అండర్-20 స్త్రీ, పురుషుల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి వై. అహ్మర్ భాషా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బసిరెడ్డి వీర కళ్యాణ్ రెడ్డి తెలిపారు.
ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్-18 విభాగంలో 28-10-2008 నుంచి 27-10-2010 మధ్య జన్మించిన వారు, అండర్-20 విభాగంలో 28-10-2006 నుంచి 27-10-2008 మధ్య జన్మించిన వారు పాల్గొనవచ్చని తెలిపారు.
పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1000 మీటర్లు, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన అర్హత ఉన్న క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారికి 16 సంవత్సరాల వయస్సు నిండి ఉండటం తప్పనిసరి అని పేర్కొన్నారు.క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రం తమ వెంట తీసుకువచ్చి నిర్వాహకులకు సమర్పించాలని సూచించారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.మరిన్ని వివరాల కోసం భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి వై. అహ్మర్ భాషాను 99496 86586, 80198 80995 నంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
