
–మండల స్థాయి పోటీల్లో విజేతలు జిల్లా స్థాయికి ఎంపిక
సలాం ప్రొద్దుటూరు –జమ్మలమడుగు:
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “చెకుముకి సైన్స్ సంబరాలు” మండల స్థాయి పోటీలు విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడంతో నిర్వహించారు. మూడు మండలాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు.మండల స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం, మూఢనమ్మకాలకు దూరంగా శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జమ్మలమడుగు కన్వీనర్ చింతకుంట్ల సురేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబు తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. మండల స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, జిల్లా స్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.ఈ పోటీల్లో జమ్మలమడుగు మండలంలోని గర్ల్స్ స్కూల్, గౌతమ్ హైస్కూల్, మైలవరం మండలంలోని రెసిడెన్షియల్ స్కూల్, పెద్దముడియం మండలంలోని పెద్దపసుపుల జడ్పీ హైస్కూల్, ముద్దనూరు మండలంలోని యామవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, ప్రశ్నించే స్వభావాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో ముద్దనూరు ఎంఈఓ, పీఈటీ మురళి, భాస్కర్, వెంకట సురేష్ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

