–మహిళలకు పోలీసుల భరోసా.. అసాంఘిక కార్యకలాపాలపై పల్లెనిద్ర
సలాం ప్రొద్దుటూరు:
అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనతో పాటు మహిళల్లో చైతన్యం, అవగాహన పెంపొందించేందుకు ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అక్కదేవతల గుడి వద్ద పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభు కృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు మహిళలతో నేరుగా మాట్లాడి వారి ప్రాంతాల్లో జరుగుతున్న పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గంజాయి, వ్యభిచారం, అక్రమ మద్యం తదితర అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఇటువంటి కార్యకలాపాల వల్ల కుటుంబాలు, యువత, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు.“అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి” అంటూ మహిళలకు పోలీసులు భరోసా కల్పించారు. ప్రజల సహకారంతోనే నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టగలమని తెలిపారు.తమ ప్రాంతాలను ప్రశాంతమైన, సురక్షితమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో మహిళలు కూడా భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై సకాలంలో పోలీసులకు సమాచారం అందించి పోలీసు వ్యవస్థకు సహకరించాలని సూచించారు.పల్లెనిద్ర కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పోలీసులతో తమ సమస్యలను పంచుకున్నారు. పోలీసుల అవగాహన కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన లభించింది.

