–సంబేపల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు..
–ఇద్దరు నిందితుల అరెస్ట్
సలాం ప్రొద్దుటూరు – సంబేపల్లి:
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లికి చెందిన ఈశ్వరయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీకి చెందిన సింహాద్రి, ఫరూక్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు సంబంధించి ఒక మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈశ్వరయ్యతో నిందితులు మద్యం సేవించిన అనంతరం పరస్పరం తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో ఆవేశానికి గురైన నిందితులు ఈశ్వరయ్యపై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు.
హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్రపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
