–బ్యాట్కు బలం.. బంతికి వేగం.. గెలుపే లక్ష్యం..!
–16 జట్ల మధ్య మూడు రోజుల హోరాహోరీ సమరం
–విజేతకు రూ.30 వేలు.. రన్నరప్కు రూ.20 వేలు
–డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం టీఎన్ఎస్ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్-2026
–పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
క్రికెట్ అభిమానుల చూపంతా ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ మైదానం వైపే..! క్రికెట్ అభిమానులకు ఉత్సాహం నింపేలా ప్రొద్దుటూరులో మూడు రోజులపాటు క్రికెట్ సందడి నెలకొననుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్-2026 నిర్వహించనున్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పోటీలకు శ్రీకారం చుట్టారు.తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి సారథ్యంలో ఆగస్టు 29, 30, 31 తేదీల్లో ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో టోర్నమెంట్ జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ తదితరులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. క్రికెట్ వంటి జట్టు క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, టీమ్వర్క్, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
16 జట్లకే అవకాశం..!
కడప జిల్లా పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. అయితే మొత్తం 16 జట్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జట్టు తమ కళాశాల పేరుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లేదా కరస్పాండెంట్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్లు ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన స్వీకరించనున్నందున ఆసక్తి ఉన్న జట్లు ముందుగానే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
విజేతకు రూ.30 వేలు.. రన్నరప్కు రూ.20 వేలు
టోర్నమెంట్లో విజేతగా నిలిచే జట్టుకు రూ.30,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.20,000 నగదు బహుమతి అందించనున్నారు. దీంతో విద్యార్థుల్లో పోటీ ఉత్సాహంతో పాటు క్రికెట్పై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది.కడప జిల్లాలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ పిలుపునిచ్చారు. మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్ క్రికెట్ అభిమానులకు, యువ క్రీడాకారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ & వివరాలకు
7893447784 | 9581965939 | 6303254192 నెంబర్ ల కు సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బచ్చల ప్రతాప్, రసూల్ గౌస్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేతన్ కుమార్ రెడ్డి, కార్యదర్శులు వంశీధర్, శ్రీనివాసులు రెడ్డి, రామాంజనేయులు రెడ్డి,బాలు తదితరులు పాల్గొన్నారు.
