సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే మున్సిపాలిటీ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. వ్యాపారులు, హోటల్ యజమానులు, దుకాణదారులు నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు.
పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ప్రొద్దుటూరు నిర్మాణంలో ప్రతి పౌరుడి సహకారం అవసరమని కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు కలిసి పనిచేస్తే ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యాన్ని త్వరలోనే సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి.. పర్యావరణాన్ని కాపాడాలి: మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్
ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో త్వరగా కరగకపోవడంతో నేల సారవంతత దెబ్బతింటుందని, కాలువలు మూసుకుపోయి వర్షాకాలంలో నీటి నిల్వలు, వరదలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ను కాల్చడం వల్ల విషవాయువులు విడుదలై గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని ఆయన వివరించారు. అలాగే ప్లాస్టిక్ సంచులను తినే పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందన్నారు.
