–గ్రామ పంచాయతీ అధికారులకు వినతిపత్రం..
–మహిళల భద్రత, పారిశుద్ధ్యంపై చర్యలు కోరిన నాయకులు
సలాం ప్రొద్దుటూరు :
అమృత్నగర్ , ఖాదర్ బాద్ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఐద్వా (AIDWA) , వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం అమృత్నగర్, ఖాదర్ బాద్ ప్రజలు తో కలిసి కొత్తపల్లె సచివాలయం ఎదుట ప్రజలను నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, వ్యవసాయ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుర్రం డేవిడ్, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డికి వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, వ్యవసాయ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుర్రం డేవిడ్, పాలజీ శేఖర్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నో రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అమృత్నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన మురుగు కాలువ నిర్మాణం చేపట్టడం, రోడ్ల ఇరువైపులా పెరిగిన కప్ప చెట్లను తొలగించడం, పనిచేయని వీధి దీపాలను మరమ్మతు చేయడం, మహిళల భద్రతకు భంగం కలిగిస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవడం, వీధుల నుంచి మడూరు రోడ్డు వరకు విద్యుత్ స్తంభాలపై వీధి దీపాలు ఏర్పాటు చేయడం, దోమల నివారణ కోసం ఫాగింగ్ నిర్వహించి మందులు పిచికారీ చేయాలని వినతిపత్రంలో కోరారు.
అదేవిధంగా ఖరార్బాద్ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో ఉన్న మురికి కాలువ వల్ల దుర్వాసన వెదజల్లుతోందని, దానిని వెంటనే శుభ్రం చేయాలని, అలాగే రోడ్లపై చెత్త చెల్లాచెదురుగా పడకుండా చెత్త కుండీలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది మహిళలు, 5 మంది పురుషులు పాల్గొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.
