–లింగాపురం సొసైటీలో యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు మండలం లింగాపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా, డీఏపీతో పాటు రాయితీపై అందించే వివిధ ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శనివారం ప్రారంభించారు.
లింగాపురం పీఏసీఎస్ ద్వారా డీబీటీ, APAIMS 2.0 విధానాల ఆధారంగా ప్రొద్దుటూరు మండలంలోని రైతులకు ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయడం ద్వారా వ్యవసాయానికి అవసరమైన సహకారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రైతుల అవగాహన కోసం ‘రైతులారా మీకోసం – ఎల్నినో ప్రభావ నివారణ’ పేరుతో రూపొందించిన కరపత్రాలను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు రైతులకు అవసరమైన సూచనలు, అవగాహన కల్పించడమే కరపత్రాల ఉద్దేశమని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, లింగాపురం సొసైటీ చైర్మన్ సిద్ధారెడ్డి నాగముని రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసాం రఘురామి రెడ్డి, ఏఓ వరహరి తదితరులు పాల్గొన్నారు.

