–కాంట్రాక్టు విధానం రద్దు చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి – సీఐటీయూ డిమాండ్
సలాం ప్రొద్దుటూరు:
కనీస వేతనాల అమలు, కాంట్రాక్టు విధానం రద్దు, కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించే “జైలు భరో” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ నాయకుడు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికులకు కనీసం రూ.26 వేల వేతనం అమలు చేయాలన్నారు.కాంట్రాక్టు వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న జైలు భరో కార్యక్రమంలో సీఐటీయూ అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు పాత బస్టాండ్ వద్దకు భారీ సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు చంటి, డీవైఎఫ్ఐ కార్యదర్శి విశ్వనాథ్ పాల్గొని జైలు భరో కార్యక్రమానికి తమ సంఘీభావం ప్రకటించి పూర్తి మద్దతు తెలిపారు.
