–ఆస్థాన-ఏ-కమాలియా బిరాదర్-ఎ-సజ్జాదా నషీన్కు భక్తులు, శిష్యుల కన్నీరుమున్నీరు
– నేడు జుమ్మా నమాజ్ అనంతరం అంతిమయాత్ర
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరులోని ఆధ్యాత్మిక వర్గాలను, వేలాది మంది భక్తులను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ ఆస్థాన-ఏ-కమాలియా బిరాదర్-ఎ-సజ్జాదా నషీన్ హజ్రత్ సయ్యద్ షా ఇర్ఫానుల్లా హుసైనీ ఖాద్రీ సాహెబ్ గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచిన వార్త తెలిసిన క్షణం నుంచే కుటుంబ సభ్యులు, శిష్యులు, ఆప్తులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
గుర్రంకొండలోని ప్రసిద్ధ సూఫీ పీఠం హజ్రత్ సయ్యద్ షా కమల్ షా అవ్వల్ (రహ్మతుల్లాహి అలైహి) పవిత్ర వంశానికి చెందిన ఇర్ఫానుల్లా హుసైనీ ఖాద్రీ సాహెబ్, ప్రొద్దుటూరులో విశిష్ట గౌరవం పొందిన స్వర్గీయ హజ్రత్ సయ్యద్ షా యూసుఫ్ హుసైనీ ఖాద్రీ సాహెబ్ కుమారుడు. తండ్రి వారసత్వంగా అందించిన ఆధ్యాత్మిక విలువలను జీవితాంతం ఆచరిస్తూ ప్రేమ, కరుణ, సేవాభావం, వినయం, మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచారు.
ఆయన వద్దకు బాధతో వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ధైర్యం నూరిపోసి చిరునవ్వుతో సాగనంపడం ఆయన ప్రత్యేకత. దస్తగిరిపేటతో పాటు ప్రొద్దుటూరు పట్టణమంతా ప్రజలతో మమేకమై, మతాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న ఆ మహనీయుడు ఇక లేరనే వార్తను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయన మృతి వార్త తెలియగానే ఉమ్మడి కడప జిల్లాతో పాటు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వివిధ దర్గాల పీఠాధిపతులు, ఉలేమాలు, మత పెద్దలు, శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో ప్రొద్దుటూరుకు చేరుకుని తుదివీడ్కోలు పలుకుతున్నారు. పలువురు ఆయనను “సేవకు, వినయానికి, మానవత్వానికి ప్రతీక”గా కొనియాడుతూ నివాళులర్పిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం ప్రొద్దుటూరు నడిఓడ్డున బంగారు అంగళ్ల సమీపంలోని హజ్రత్ సయ్యద్ షా హుస్సేన్ వలి స్వామి దర్గాలో, ఆయన తాత కర్నూలు వాలే సాహెబ్ హజ్రత్ సయ్యద్ షా జహరుద్దీన్ హుసైనీ ఖాద్రీ సాహెబ్ ఆస్థానంలో జనాజా నమాజ్ నిర్వహించనున్నారు. అనంతరం ప్రొద్దుటూరు జామియా మసీదు ఖబరస్తాన్లో కుటుంబ పెద్దల మజార్ల పక్కనే ఆయనను ఖననం చేయనున్నారు.
ఆధ్యాత్మిక సేవ, మానవతా దృక్పథం, సౌమ్య స్వభావంతో వేలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హజ్రత్ సయ్యద్ షా ఇర్ఫానుల్లా హుసైనీ ఖాద్రీ సాహెబ్ మరణం ప్రొద్దుటూరుకు మాత్రమే కాకుండా దక్షిణ భారత సూఫీ సంప్రదాయానికి తీరని లోటుగా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్.”

