సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వచ్ఛ సంకల్ప దీక్ష” కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకుని, ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, జూట్ సంచులు వంటి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని కోరారు.
ప్రతి కుటుంబం తప్పనిసరిగా రెండు బుట్టల విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తడి వ్యర్థాలను ఒక బుట్టలో, పొడి వ్యర్థాలను మరో బుట్టలో వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించడం ద్వారా వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణతో పాటు పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పరిశుభ్రమైన ప్రొద్దుటూరు నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్న కమిషనర్, “స్వచ్ఛ సంకల్ప దీక్ష”ను విజయవంతం చేసేందుకు పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
