–ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తుకు సిద్ధమని ప్రకటించాలి
సలాం ప్రొద్దుటూరు:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో ఆరోపణలు వచ్చిన సందర్భంలో సీబీఐ విచారణకు సిద్ధమైనట్లే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అదే ధైర్యంతో సీబీఐ విచారణ కోరగలరా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.శనివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో పరిటాల రవి హత్య కేసు నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రస్తుతం మంత్రి నారా లోకేష్పై వస్తున్న ఆరోపణలతో పాటు ఇసుక, మద్యం, భూ వ్యవహారాలు, మెగా డీఎస్సీ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వినిపిస్తున్న అవినీతి ఆరోపణలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐ విచారణకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.”వైఎస్ఆర్లా సీబీఐ విచారణ కోరగలవా బాబు? నిజంగా ప్రభుత్వం పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తుంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు?” అని రాచమల్లు ప్రశ్నించారు.
నీట్ ఉద్యమ విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ ప్రశ్నాపత్రం వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేసిన విద్యార్థులపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాచమల్లు డిమాండ్ చేశారు. లాఠీచార్జికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రశ్నాపత్రం లీక్ కాకపోయి ఉంటే లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు.
మహిళా విద్యార్థులపై కఠినంగా వ్యవహరించడం, వారి కుటుంబాలను అవమానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ, నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మెగా డీఎస్సీలో అక్రమాల ఆరోపణలు
మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియలో కూడా తీవ్రమైన అక్రమాలు జరిగాయని రాచమల్లు ఆరోపించారు. ప్రశ్నాపత్రాల నిర్వహణ, కంప్యూటర్ డేటా అప్లోడింగ్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిని వినియోగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మెరిట్కు బదులుగా డబ్బు ఆధారంగా ఉద్యోగాలు కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొంటూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మీడియా స్వేచ్ఛకు ముప్పు
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీడియా సంస్థలు, పత్రికలు, సంపాదకులపై కేసులు నమోదు చేయడం ద్వారా మీడియా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని హెచ్చరించారు.
యువత కోసం ధర్మయుద్ధం
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పాలనకు బదులుగా “తండ్రి–కొడుకుల పాలన” కొనసాగుతోందని విమర్శించిన రాచమల్లు, యువత హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ధర్మయుద్ధానికి సిద్ధమని స్పష్టం చేశారు.
