సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐ.వి.ఎఫ్) సౌజన్యంతో, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో ‘సృజనోత్సవం’ పేరుతో సాహిత్య–సాంస్కృతిక కార్యక్రమం జూలై 31 (శుక్రవారం) విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, మినీ స్కిట్స్, కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణలు, గజల్ గానం, లక్కీ డ్రాలు, సత్కారాలుతో పాటు ఐ.వి.ఎఫ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు.
కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.జి. వెంకటేష్, ఎమ్మెల్యేలు బోండా ఉమా మహేశ్వరరావు, గద్దె రామమోహన్, ఐ.వి.ఎఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గొంట్ల మోహనరావు, రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు లక్ష్మణగుప్తా తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ‘కళాక్షేత్ర ది డాన్స్ అకాడమీ’ నిర్వాహకులు ఎ. గీత, పి. మౌనిక శిష్యబృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అనంతరం ఐ.వి.ఎఫ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరగనుండగా, తరువాత కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణలు, మినీ స్కిట్స్, గజల్ గానం, సత్కారాలు, సన్మానాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను సీనియర్ ఫొటో జర్నలిస్టు వై.డి. ఆనంద్ పర్యవేక్షించనున్నారు. కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణలు తదితర కార్యక్రమాలను కలిమిశ్రీ టీమ్ సభ్యులు యేమినేని వెంకటరమణ, విష్ణుభొట్ల రామకృష్ణ, చొప్పా రాఘవేంద్రశేఖర్, చిత్రాడ కిషోర్ కుమార్ తదితరులు సమన్వయం చేయనున్నారు.
కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన వారు నమోదు కోసం చొప్పా రాఘవేంద్రశేఖర్ను 83329 03156 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
