–దస్తావేజుల సంఘం రిలే దీక్షలకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు!!
సలాం ప్రొద్దుటూరు:
ప్రయివేటు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణ సరికాదని, జివో 396 వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్,డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి జిల్లా పుల్లంపేట సబ్ రిజిస్టర్ ఎదురుగా దస్తావేదన సంఘం చేస్తున్న రిలే దీక్షలకు, సిఐటియు నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో పి3 పేరుతో ప్రైవేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఇచ్చిన జీవో 396 ప్రయివేటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, డిమాండ్ చేశారు. అనేక సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నా యని, అందుకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులు కొనసాగించడానికి బదులు ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటినే తగలబెట్టే వైఖరి సరైంది కాదని తెలిపారు. రిజిస్ట్రార్ ఆఫీసులను ఆధునీకరించడమూ అవసరమేనని, ఆ పేరుతో ప్రయివేటుకిస్తే అవినీతి, అక్రమాలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. ఆధార్, పాస్పోర్టు సేవలతో రిజిస్ట్రేషన్లను పోల్చడం సరికాదన్నారు. ఆధార్ ఒక గుర్తింపు పత్రం, పాస్పోర్టు విదేశీ ప్రయాణానికి అనుమతి పత్రం అని విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొందని, కానీ రిజిస్ట్రేషన్ కోట్ల రూపాయల స్థిరాస్తికి సంబంధించినదని తెలిపారు. ఇతర సేవలు కూడా కీలకమైనవేనని పాస్పోర్టు గడువు పదేళ్ళు కాగా, ఆధార్ కూడా ఆయా సందర్భాల్లో మార్చవలసి ఉంటుందని కానీ రిజిస్ట్రేషన్ పత్రాలు స్థిరంగా ఉంటాయని వివరించారు. కనుక వాటిని సరిపోల్చడం తగదని తెలిపారు.రాష్ట్రంలో భూ వివాదాలు పెద్ద సంఖ్యలో ఉండడమే గాక కొత్త రూపాల్లో ముందుకొస్తున్నాయని, 22 u – అంటే చుక్కల భూముల పేరుతో అనేక చిక్కులు, అదేవిధంగా గతంలో డి పట్టా భూములను ఫ్రీ హోల్డ్ చేయడం, అడ్డగోలు మ్యుటేషన్లు వంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయివేటు కిస్తే ఇలాంటి ఘటనలు ఇంకా పెరుగుతాయి అన్నారు. ప్రైవేటు అంటేనే లాభాపేక్ష, అలాగే అదుపు ఆజ్ఞలకు లోబడి నిబద్ధతగా వ్యవహరిస్తా రన్న నమ్మకం లేని పరిస్థితి అని తెలిపారు. భూములు అందునా పట్టణ భూముల విలువలు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో కీలకమైన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటు వారి చేతిలో పెట్టడం దారుణమని తెలిపారు. ఏ ప్రయోజనాలను ఆశించి ప్రైవేటీకరణ చేస్తున్నామని జీవో 396లో పేర్కొన్నారో ఆ పనులన్నీ ఇప్పుడు ఆధునిక సర్వర్ల వినియోగంతో అమలు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రైవేటుతో సేవల వేగం పెరుగుతుందని చెప్పడం మోసపూరితమని విమర్శించారు. అదే విధంగా పెద్ద సంఖ్యలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు కూడా ఉపాధి కోల్పోతారని, రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో, సిఐటియు మండల నాయకులు, ఎస్ శ్రీలక్ష్మి,కో కన్వీనర్ ఏ .రోజా, పివి రమణ, దస్తావేజుల సంఘ నాయకులు, జై సింహా స్వామి, జాకీర్, తదితరులు పాల్గొన్నారు.
