సలాం ప్రొద్దుటూరు ( జమ్మలమడుగు):
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్లో భాగంగా జమ్మలమడుగులోని డాక్టర్ హెలెన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో హెలెన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
