–ప్రైవేట్ ఐటీఐ సెల్ఫ్ సెంటర్లను రద్దు చేయాలి.
–PGRSలో ఫిర్యాదు చేసిన PSU, AISB నాయకులు
సలాం ప్రొద్దుటూరు (కడప):
కడప జిల్లాలో జూలై 6వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) ప్రాక్టికల్ పరీక్షలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని, అలాగే ప్రైవేట్ ఐటీఐలలో అమలవుతున్న సెల్ఫ్ సెంటర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో ఫిర్యాదు చేసినట్లు ప్రగతిశీల విద్యార్థి సంఘం (PSU) రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (AISB) రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో 23 ప్రయివేట్ ఐ టీ ఐ కాలేజీలలో 3914 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు తరగతులు నిర్వహించకుండా గ్యారెంటీ పాస్ స్కీం పద్ధతుల్లో విద్యార్థులను చేర్చుకొని ప్రభుత్వం నుండి తప్పుడు ప ద్ధతిలో స్కాలర్షిప్ పొందడంతో పాటు జూలై ఆరో తేదీ నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షలలో ప్రైవేట్ ఐటీఐలలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వున్నాయి. గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కనీసం వసతులు లేకపోయినా అధికారులను మేనేజ్ చేసుకొని ప్రత్యేకంగా సెల్ఫ్ సెంటర్ వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ విధానం కారణంగా పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ విధానాన్ని రద్దు చేసి ఇతర గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా తటస్థ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అలాగే జిల్లా పరిపాలన, నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే సంస్థలు, సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల ప్రతిభకు న్యాయం జరిగేలా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ ఇండియా యూత్ లీగ్ నాయకుడు చిరంజీవి పాల్గొన్నారు.
