– ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వాన
సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు):
మైదుకూరు నియోజకవర్గ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మైదుకూరు ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవ, కృషి ఫలితంగా ఓనిపెంటలోని మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం జరిగింది.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు నాణ్యమైన విద్యను అందుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఇంటర్మీడియట్ విద్య అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థినులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ జూనియర్ కళాశాలలో ఎం.పి.సి (MPC) మరియు బై.పి.సి (BiPC) గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థినులకు అత్యుత్తమ అధ్యాపకులు, వసతి, భోజనం మరియు ఇతర సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణం కల్పించబడుతుంది.
ఓనిపెంట గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం 08-06-2026 (సోమవారం) నుండి దరఖాస్తులు స్వీకరించబడతాయి. అర్హత గల విద్యార్థినులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వి. నిర్మల రెడ్డి కోరారు.
విద్యా రంగ అభివృద్ధికి, ముఖ్యంగా గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడంలో ఎమ్మెల్యే గారి కృషి ప్రశంసనీయమని స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
