–ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ను పరిశీలించిన రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
సలాం ప్రొద్దుటూరు (కడప):
కడప నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు ప్రజారోగ్య భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కడప నగర పాలక సంస్థ పరిధిలోని కనుమలోపల్లి వద్ద నిర్వహణలో ఉన్న ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ను ఆయన పరిశీలించారు. అక్కడి డంప్ యార్డులో వ్యర్థాల సెగ్రిగేషన్, రీసైక్లింగ్ విధానాన్ని పరిశీలించిన అనంతరం.. కేంద్రంలో వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, శుద్ధి, నిర్వహణ విధానాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేఎంసీ పర్యావరణ ఇంజినీర్లు, ప్రజారోగ్య అధికారులు, పారిశుద్ధ్య అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యర్థాల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్వహణలో ప్రజారోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని, ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పట్టాభిరామ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కడప నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, ఎస్.ఈ. చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. రమేష్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
