సలాం ప్రొద్దుటూరు:
ప్రతి ఒక్కరూ రక్తదాతలను ప్రోత్సహించాలని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందబాబు తెలిపారు.ఆపద సమయంలో ఉన్న వ్యక్తికి రక్తదానం చేయడం అనేది ప్రాణ దానం చేయడంతో సమానమన్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఆస్పత్రిలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోహలను వీడి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుందని, నీరసం కలుగుతుందనే భావన చాలామందిలో ఉందన్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల మనిషి మునుపటి కంటే ఇంకా హుషారుగా ఉంటాడన్నారు. అనంతరం పలుమార్లు రక్తదానం చేసిన వ్యక్తులను అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ ఆర్ఎంఓ రూపానంద్, యోగివేమన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ జయ చంద్రారెడ్డి, టీడీపీ నాయకులు ఈ వీ సుధాకర్ రెడ్డి, నల్లపోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
