సలాం ప్రొద్దుటూరు:
మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసి, పొద్దుటూరు పట్టణం మరియు మండల పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాష మాట్లాడుతూ, ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల తమ ఫీజుల పట్టికను తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా పాఠశాలల యాజమాన్యాలు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పాఠశాలల ద్వారానే అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ఈ నెల 2వ తేదీన పొద్దుటూరు మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీ, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల అధిక ధరల విక్రయాలను అరికట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీజే నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాష, పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాషా, సభ్యులు ముక్తాయార్, అల్లాబకాష్ తదితరులు పాల్గొన్నారు.
