సలాం ప్రొద్దుటూరు:
ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సూచించారు.
స్థానిక నెహ్రూ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. ప్రధాన జలాశయాల్లో కూడా తగినంత నీటి నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితేనే ఒక పంటకు సరిపడా సాగునీరు అందే అవకాశముందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే వర్షాధార పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను అంచనా వేసుకుని సాగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఘంటశాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, మాజీ శివాలయం పాలకమండలి సభ్యులు పల్లా శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
