
–ఆదోనిలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 500 మందికిపైగా ప్రజలకు వైద్య సేవలు
సలాం ప్రొద్దుటూరు (ఆదోని):
సమాజ సేవలో భాగంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేయూతనందిస్తూ అల్ సఖాఫ్ వెల్ఫేర్ ట్రస్ట్, జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో సయ్యద్పేటలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజలకు భరోసానిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరానికి ఆదోని పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి 500 మందికిపైగా ప్రజలు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.
ఉచిత పరీక్షలు.. ఉచిత మందులు
సయ్యద్ తన్వీర్ అహ్మద్ ఖాద్రి, సయ్యద్ తౌసిఫ్ అహ్మద్ ఖాద్రి, సయ్యద్ సాబీర్ పాషా ఖాద్రి, జీలన్, గౌస్ తదితరుల ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు ప్రజలకు వైటల్స్, బ్లడ్ షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి స్కానింగ్ పరీక్షలు సైతం ఉచితంగా అందించారు.

వైద్య పరీక్షల అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు తగిన సలహాలు, సూచనలు అందించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్య పరీక్షల భారం లేకుండా ఒకే వేదికపై పలు రకాల వైద్య సేవలు అందించడం శిబిరానికి ప్రత్యేకతగా నిలిచింది.
సేవాభావం అభినందనీయం
ఈ సందర్భంగా వైద్య సేవలు అందించిన డా. రాఘవేంద్ర, డా. వర ప్రసాద్ కురువ, డా. సమీర్ హుస్సేన్, డా. ప్రశాంత్, డా. ఎం. పవిత్ర, డా. ముబీన్ అహ్మద్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
“ఆరోగ్యమే మహాభాగ్యం.. సేవే సమాజానికి నిజమైన సంపద” అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం ప్రజల ఆరోగ్యంపై నిర్వాహకులకున్న సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. భవిష్యత్తులోనూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
