— ఇమాములతో డా. ముక్తియార్ కీలక భేటీ
సలాం ప్రొద్దుటూరు:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం సమాజానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ కీలకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ పరిధిలోని వివిధ మసీదుల ఇమాములతో శుక్రవారం స్థానిక ఈద్గా మస్జిద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు డా. వి.ఎస్. ముక్తియార్ అధ్యక్షత వహించారు.రానున్న స్థానిక ఎన్నికల్లో ముస్లింలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెందిన కొందరు ఇమాములను కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలోకి దింపే అంశంపై లోతుగా సమాలోచనలు జరిగాయి. స్థానిక సంస్థల్లో సమాజానికి ప్రాతినిధ్యం ఉంటే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మరింత చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పెన్షన్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ప్రతి మసీదు పరిధిలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల వివరాలు తెలియజేసి, వారు వాటి ప్రయోజనాలను పొందేలా సహకరించాలని ఇమాములకు సూచించారు.ఇదిలా ఉండగా, ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఉపశమనం కలిగేలా సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.ముస్లిం సమాజ సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులకు చేరవేయడం వంటి అంశాలపై సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ సమావేశంలో అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ప్రతినిధులతో పాటు ప్రొద్దుటూరులోని వివిధ మసీదుల ఇమాములు పాల్గొన్నారు.
