–వ్యక్తిగత వ్యాఖ్యలను కుల వివాదంగా మార్చొద్దు.. బీసీ నాయకుడు గోపి యాదవ్
సలాం ప్రొద్దుటూరు:
వ్యక్తుల మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలను మొత్తం బీసీ సమాజానికి, ముఖ్యంగా యాదవ కులానికి ఆపాదించడం సరికాదని వైఎస్సార్సీపీ బీసీ నాయకుడు గోపి యాదవ్ అన్నారు. ఒకరిపై ఒకరు చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా చూడాలని, వాటిని కులాల మధ్య వివాదంగా మార్చవద్దని ఆయన కోరారు.
ఈ సందర్భంగా గోపి యాదవ్ మాట్లాడుతూ.. తన అన్న రాచమల్లు ఉద్దేశించి అనుచితంగా మాట్లాడినందుకే తనదైన రీతిలో స్పందించారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని రాజకీయంగా పెద్దది చేసి బీసీలకు, యాదవ సామాజికవర్గానికి ఆపాదించడం బాధాకరమన్నారు.
“వ్యక్తిగతంగా జరిగిన మాటల వ్యవహారాన్ని కులానికి ఆపాదించడం సరికాదు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలి. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సామరస్య వాతావరణానికి సహకరించాలి” అని గోపి యాదవ్ విజ్ఞప్తి చేశారు.
తన అన్న బీసీ వర్గాలకు, కార్యకర్తలకు ఇచ్చే గౌరవానికి తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన తెలిపారు. తాను సాధారణ కార్యకర్తగా ఉన్నప్పటికీ తమ అన్న ఇంటికి స్వేచ్ఛగా వెళ్లి కుటుంబ సభ్యుడిలా మెలుగుతానని చెప్పారు. బీసీ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఇతర సామాజిక వర్గాల వారిని కూడా ఆయన అదే విధంగా గౌరవిస్తారని వివరించారు.
అందువల్ల బీసీ నాయకులు, కార్యకర్తలు ఏదైనా అంశంపై స్పందించే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడాలని గోపి యాదవ్ సూచించారు. అన్యాయంగా ఆరోపణలు చేయడం, వ్యక్తిగత వ్యాఖ్యలకు కుల రంగు పులమడం వల్ల బీసీల మధ్య ఐక్యత దెబ్బతింటుందని ఆయన అన్నారు.
బీసీలంతా పరస్పరం గౌరవంతో, సంయమనంతో వ్యవహరించాలని, రాజకీయ భేదాలను కులాల మధ్య విభేదాలుగా మార్చకుండా సామాజిక ఐక్యతను కాపాడాలని గోపి యాదవ్ కోరారు.
