–ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం
– ఏపీ గ్రూప్–1 అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, ప్రొద్దుటూరు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గ్రూప్–1 అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. డీఏ విడుదలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న చొరవకు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఖజానాలో గణనీయమైన భాగం ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆదాయ వనరులను సమకూర్చడంలో ప్రతి ఉద్యోగి తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉద్యోగులు అండగా నిలిచి, అదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సేవల పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత పెంపొందించేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విజయవంతం కావడానికి కృషి చేసిన ఉద్యోగ సంఘాల నాయకులను కమిషనర్ అభినందించారు.

