–మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న కడప పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం
సలాం ప్రొద్దుటూరు (చాపాడు):
పిల్లల చదువు, ప్రవర్తన, అభివృద్ధిపై తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని టిడిపి కడప పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం సూచించారు.
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (Mega PTM) 4.0 కార్యక్రమం చాపాడు జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడప పార్లమెంట్ మైనార్టీ విభాగం కార్యదర్శి అక్బర్ సలీం మాట్లాడారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చి ప్రోత్సహించకుండా, వారితో ప్రేమగా మెలుగుతూ వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఇతర పిల్లలతో పోల్చడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, అలాంటి ధోరణికి దూరంగా ఉండాలని సూచించారు.
ప్రతిరోజూ పిల్లలతో కొంత సమయం గడిపి పాఠశాలలో బోధించిన పాఠాల గురించి చర్చించడం ద్వారా వారి అభ్యాసంపై మరింత అవగాహన పెరుగుతుందని తెలిపారు.
ఎమ్మెల్యే పుట్టా హామీ
అలాగే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల చాపాడు జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించి, పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్వో ప్లాంట్ (శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం)ను కూడా మంజూరు చేశారని అక్బర్ సలీం వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు
