–లాకప్ డెత్ కేసులో రాజకీయ కోణమా..?
–నాగరాజు రిస్క్ వెనుక ఎవరి భరోసా..?
–సాయి కృష్ణ కేసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు.. నిజాలు వెలుగులోకి వస్తాయా?
–లాకప్ డెత్ కేసు వెనుక పెద్ద కుట్ర ఉందా..?
–సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై మేడా శ్రీనివాస్ పలు ప్రశ్నలు
సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):-
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, న్యాయవాది మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తారు.సాయి కృష్ణపై గతంలో నేరారోపణలు ఉన్నప్పటికీ, అతను పోలీస్ కస్టడీలో మృతి చెందడం అత్యంత తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు అంతటి రిస్క్ తీసుకోవడానికి గల కారణాలు ఏమిటో దర్యాప్తులో వెలుగులోకి రావాలని అన్నారు.సాయి కృష్ణను హత్య చేయాలని లేదా లాకప్ డెత్ చేయాలని ఎవరైనా ప్రభావశీల వ్యక్తులు, రాజకీయ నాయకులు లేదా ఇతరులు ప్రేరేపించారా అనే కోణంలో కూడా విచారణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఈ ఘటన వెనుక మరికొందరి పాత్ర ఉందా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించాలని కోరారు.సీఐ నాగరాజు అరెస్టు సందర్భంగా నిర్వహించిన ఆందోళనల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు, రాజకీయ అనుబంధాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. మృతుడు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ప్రకటనల్లో వచ్చిన మార్పులు కూడా అనేక సందేహాలకు తావిస్తున్నాయని వ్యాఖ్యానించారు.ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమగ్రంగా విచారించి, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించి నిజానిజాలు వెలికితీయాలని మేడా శ్రీనివాస్ కోరారు. అవసరమైతే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.కృష్ణలంక లాకప్ డెత్ కేసులో పూర్తి స్థాయి, పారదర్శక దర్యాప్తు జరిగితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. న్యాయం జరిగేలా సంబంధిత దర్యాప్తు సంస్థలు ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
