ePaper
Monday, September 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి..!!

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి..!!

📰 Generate e-Paper Clip

 

 

–జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

–జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

 

సలాం ప్రొద్దుటూరు – కడప:

శ్రీ గణనాథుని ఆశీస్సులతో జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.భక్తి, సంప్రదాయం, ఆత్మీయతలతో వినాయక చవితి వేడుకలను ఆనందంగా నిర్వహించుకోవాలని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పొరుగువారితో కలిసి సోదరభావంతో పండుగ జరుపుకోవాలని కోరారు. పండుగ వేళ ప్రజల భద్రత, ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, శబ్ద కాలుష్యానికి దూరంగా ఉంటూ చిన్నారులు, వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్నవారి పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ కోరారు. నీటి వనరులు కలుషితం కాకుండా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని, పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలను నివారించాలని సూచించారు. మన భక్తి ప్రకృతికి భారం కాకుండా, భవిష్యత్ తరాలకు మేలు చేసేలా ఉత్సవాలను నిర్వహించడమే నిజమైన పండుగ స్ఫూర్తి అన్నారు.గణనాథుని కృపతో జిల్లాలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కుటుంబాల్లో సిరిసంపదలు, ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం నెలకొనాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రజల ఐక్యత, భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన సహకారంతో వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!