SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:49 pm Posted by : SALAM PRODDATUR

టీడీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యం.. శక్తి వంచన లేకుండా పనిచేస్తా

 

బీసీలకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలి..

-–పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వాలని లోకేశ్‌ను కోరా

–టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి

 

 

సలాం  ప్రొద్దుటూరు:

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం వై ఎం ఆర్ కాలనీ లో నీ తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించడంతో పాటు, 2019–2024 మధ్య కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన రాజకీయ అవకాశాలు కల్పించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిసి మూడు ప్రతిపాదనలు వివరించినట్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీలకు రిజర్వు చేయాలని, 2019–2024 మధ్య టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసి ప్రస్తుతం కూడా పార్టీతో కొనసాగుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలాగే పార్టీ కష్టకాలంలో ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలిచిన కుటుంబాలను గుర్తించి, ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు వారికి తగిన అవకాశం కల్పించాలని ప్రతిపాదించినట్లు వివరించారు.గతంలో పార్టీ కోసం పనిచేసిన ముక్తియర్, సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థుల సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించాలని కోరినట్లు తెలిపారు. తాను వివరించిన అంశాలు పార్టీ పరిశీలిస్తుందని నారా లోకేశ్ తెలిపినట్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

 

వ్యక్తిగత విమర్శలు కాదు.. ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధం

 

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న విమర్శలపై స్పందించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి.. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు బదులుగా ప్రజా సమస్యలు, పట్టణ అభివృద్ధి, మున్సిపల్ పాలనపై చర్చ జరగాలని అన్నారు.ప్రజా సమస్యలు, రాజకీయ అంశాలపై బహిరంగంగా చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా, శివాలయంలో అయినా కూర్చొని చర్చిద్దాం. ఎవరి వద్ద ఉన్న ఆధారాలను వారు ప్రజల ముందు ఉంచాలి” అని ఆయన పేర్కొన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌పై విమర్శలు చేసే సమయంలో గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని సూచించారు. రాజకీయ విభేదాలు సహజమేనని, అయితే వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజలకు సంబంధించిన అంశాలపై మాట్లాడాలని కోరారు.

 

టౌన్ బ్యాంక్, ఎస్‌ఎస్ మాల్ అంశాలపై ప్రశ్నలు

 

టౌన్ బ్యాంక్‌కు సంబంధించిన వ్యవహారాలపై కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. బ్యాంకులోని రుణ ఖాతాలు, ఎస్‌ఎస్ మాల్‌కు సంబంధించిన వ్యవహారాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.ఈ అంశానికి సంబంధించి తన వద్ద ఉన్న సమాచారం, ఆధారాలను పార్టీ అధిష్ఠానానికి సమర్పించినట్లు తెలిపారు. అవసరమైన మరిన్ని వివరాలను త్వరలో బహిర్గతం చేస్తామని చెప్పారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత వ్యక్తులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించినా, వారి విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టకాలంలో నిలిచిన వారికి గుర్తింపు, బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, పట్టణ అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా 100 శాతం పనిచేస్తాం. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరం సమిష్టిగా ముందుకు సాగుతాం. ప్రజల అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉండాలి” అని ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.