SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 8:57 pm Posted by : SALAM PRODDATUR

ఆపదలో అండగా నిలిచిన కొనిరెడ్డి

–మానవత్వం, దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సర్పంచ్‌.. క్షతగాత్రుడి వైద్యానికి రూ.25 వేల సాయం

 

సలాం  ప్రొద్దుటూరు:

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వానికి నిదర్శనమని చాటి చెప్పారు కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వలస కార్మికులను పరాయి రాష్ట్రానికి చెందిన వారని చూడకుండా తన వంతు సహాయం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.ప్రొద్దుటూరు ఖాదరాబాద్‌ సమీపంలోని మద్యం గోడౌన్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాకు చెందిన ముగ్గురు హమాలీలు పని ముగించుకుని నడుచుకుంటూ వస్తుండగా, వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన మహీంద్రా వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో అరుణ్‌ అనే యువకుడి కుడి చెవి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ప్రమాద విషయం తెలుసుకున్న శివచంద్రారెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. క్షతగాత్రులను తన సొంత వాహనంలో హోమ్స్‌పేటలోని నాగదస్తగిరి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అరుణ్‌కు స్వయంగా సీటీ స్కాన్‌ చేయించడంతో పాటు, పరిస్థితి విషమించకుండా మెరుగైన వైద్యం కోసం తన సొంత ఖర్చుతో సుమారు రూ.25 వేల వరకు వెచ్చించి అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు.అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్‌ వరుణ్‌కుమార్‌ రెడ్డితో మాట్లాడి అరుణ్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యుల నుంచి సమాచారం అందడంతో ఊపిరి పీల్చుకున్న శివచంద్రారెడ్డి, అరుణ్‌కు ధైర్యం చెప్పారు. వైద్యానికి అవసరమైన తదుపరి ఆర్థిక సహాయాన్ని కూడా తానే భరిస్తానని, ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఇదిలా ఉండగా సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. విషయం తెలుసుకున్న మద్యం గోడౌన్‌ హమాలీలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు.ఆపద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి, నిరుపేద కార్మికులకు అండగా నిలిచిన కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి స్థానిక ప్రజలు, తోటి హమాలీలు కృతజ్ఞతలు తెలిపారు. తోటి మనిషి ప్రాణాలను కాపాడేందుకు ఆర్థికంగా, మానవీయంగా అండగా నిలిచిన ఆయన సేవాభావం పలువురికి ఆదర్శంగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.