–15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై కమిషనర్ సమీక్ష
–నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జి ఏఈ ఉదయ్కుమార్రెడ్డి పై ఆగ్రహం
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై కమిషనర్ సమగ్రంగా సమీక్షించారు. మొత్తం 49 పనులకు గాను 14 పనులు మాత్రమే ప్రారంభమైనట్లు అధికారులు వివరించడంతో కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనుల్లో జాప్యం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన పనులను ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభించాలని, ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయిన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహించే గుత్తేదారులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఇకపై అభివృద్ధి పనుల పురోగతిని తాను స్వయంగా నిరంతరం పర్యవేక్షిస్తానని తెలిపారు. పనుల అమలులో ఎక్కడైనా జాప్యం జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు.విధుల నిర్వహణలో అలసత్వం వహించిన ఇన్చార్జి ఏఈ పీ. ఉదయ్కుమార్రెడ్డిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసి, ఆయనను విధుల నుంచి తప్పించి సొంత శాఖకు పంపినట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, అభివృద్ధి పనుల అమలులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అభివృద్ధి పనులను ఆలస్యం చేయకుండా కాంట్రాక్టర్లతో వెంటనే ప్రారంభించాలని సూచించిన నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రజాప్రయోజనార్థం సుమారు రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసులును కమిషనర్ ఆదేశించారు.
ప్రారంభించిన ప్రతి పనికి సంబంధించిన వివరాలను సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు తెలియజేయాలని, పనుల పురోగతిని నిరంతరం అప్డేట్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రజలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు ఆలస్యం కాకుండా ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఇంజనీర్లు రాజేష్, ఏశోద, అసిస్టెంట్ ఇంజనీర్లు సురేంద్ర, దస్తగిరి, వినోద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.