SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 2:38 pm Posted by : SALAM PRODDATUR

ప్రజా ధనం కు రక్షణ ఉందా?

 

–టౌన్ బ్యాంకులో ₹11 లక్షల వ్యవహారం

–టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర ఆరోపణలు

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో బినామీ పేరుతో ఖాతా తెరిచి ₹11 లక్షల నగదును కాజేసి తిరిగి జమ చేసిన టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తానని ప్రకటించారు.విలేకరుల సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ.. “ప్రజల ధనానికి బ్యాంకుల్లో రక్షణ లేదు.. ప్రభుత్వ భూములకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలకు సంబంధించిన డీఎస్సీకి రక్షణ లేదు” అంటూ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తులు, యువత భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

మృతుడి కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ముపై ప్రశ్నలు

లైన్‌మన్ సుబ్బారాయుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన అనంతరం ఆయన కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. మృతుడి కుమార్తె సుచరితకు అందాల్సిన సొమ్ము విషయంలో జరిగిన పరిణామాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలని కోరారు.రాచమల్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 లో బినామీ ఉపయోగించి ఖాతా తెరిచారని ఆరోపించారు. అనంతరం మార్చి నెలలో ఒకసారి రూ.9 లక్షలు, మరుసటి రోజు రూ.2 లక్షలు పైన మొత్తం ₹11 లక్షలు విత్ డ్రా చేశారని చెప్పారు.ఈ ఖాతా, నగదు లావాదేవీల వెనుక టీడీపీ నేతలు సుధాకర్‌రెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డి ఉన్నారని రాచమల్లు ఆరోపించారు. బినామీగా ఉషారాణి అనే మహిళ పేరును ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు.

 

విషయం బయటకు రావడంతో డబ్బు తిరిగి చెల్లింపు?

 

ఈ వ్యవహారం బయటకు వచ్చిన అనంతరం కొండారెడ్డి ప్రమేయంతో సంబంధిత వ్యక్తుల ద్వారా బ్యాంకులో నగదును తిరిగి జమ చేయించారని రాచమల్లు ఆరోపించారు. డబ్బు తిరిగి చెల్లించడం మాత్రమే కాకుండా, అసలు ఖాతా ఎలా తెరవబడింది? బినామీ ఎలా ఉపయోగించారు? నగదును ఎవరు ఉపసంహరించారు? లావాదేవీల వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

 

న్యాయపరంగా పోరాడతా

 

టౌన్ బ్యాంకులో జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోబోమని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సొమ్ముకు సంబంధించిన అంశం కావడంతో వాస్తవాలు పూర్తిగా బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సంబంధిత రికార్డులు, ఖాతా వివరాలు, నగదు లావాదేవీలపై విచారణ జరిపించాలని కోరుతూ ఈ ఘరానా మోసం వ్యవహారంపై న్యాయపరంగా పోరాటం చేస్తానని ఆయన తెలిపారు.