–పూర్వ విద్యార్థులతో మరింత బలపడిన అనుబంధం.. విద్యార్థుల ఆవిష్కరణలకు ‘జయం’ పథకం శ్రీకారం
సలాం ప్రొద్దుటూరు –చాపాడు:
CBIT కళాశాలలో శనివారం ‘అలుమ్ని మీట్-2K26’ పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ విద్యాసంస్థతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఏ విద్యాసంస్థకైనా పూర్వ విద్యార్థులే కీలకమైన బలమని అన్నారు. కళాశాలలో విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడిన వారు తమ విద్యాసంస్థతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, కళాశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు భవిష్యత్తులో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తల్లిదండ్రుల పట్ల బాధ్యతను మరువకూడదని, వారి ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
పూర్వ విద్యార్థుల విజయాలు కళాశాలకు గర్వకారణం
CBIT కళాశాల చైర్మన్ డా. వి. జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. CBITలో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న పూర్వ విద్యార్థులు తిరిగి కళాశాలకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.అలుమ్ని కార్యక్రమాల ద్వారా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకుల మధ్య అనుబంధం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. పూర్వ విద్యార్థుల అనుభవాలు ప్రస్తుత విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
విద్యార్థుల ఆలోచనలకు ‘జయం’ పథకం
కార్యక్రమంలో CBIT సీఈఓ డా. వి. లోహిత్ రెడ్డి ‘జయం’ పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు, వ్యాపార స్ఫూర్తిని ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.మంచి వ్యాపార ఆలోచనలు కలిగిన విద్యార్థులు తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకెళ్లి స్టార్టప్లుగా అభివృద్ధి చేసుకునేందుకు కళాశాల తరఫున సీడ్ ఫండ్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద ఏటా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు నిధులు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారి ఆలోచనలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా భవిష్యత్ పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు ‘జయం’ పథకం దోహదపడుతుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది.
విద్యార్థుల భవిష్యత్తుకు వినూత్న వేదిక
అలుమ్ని మీట్-2K26 ద్వారా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, కళాశాల యాజమాన్యం మధ్య అనుబంధం మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. పూర్వ విద్యార్థుల అనుభవాలు, సూచనలు విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై కళాశాల చైర్మన్ డా. వి. జయచంద్ర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సీఈఓ డా. వి. లోహిత్ రెడ్డి, డైరెక్టర్ అడ్మిన్ డా. జి. శ్రీనివాసుల రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. శృతి తదితరులు కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.పూర్వ విద్యార్థుల అనుభవాలు–ప్రస్తుత విద్యార్థుల ఆలోచనలు కలిసే వేదికగా అలుమ్ని మీట్-2K26 నిలిచిందని, ‘జయం’ పథకం విద్యార్థులలోని ప్రతిభకు ఆచరణాత్మక అవకాశాలను కల్పించే కీలక అడుగుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.