–ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
–50 రోజులుగా కొనసాగుతున్న నో ప్లాస్టిక్ ఉద్యమం..
–దుకాణాల్లో కమిషనర్ తనిఖీలు
సలాం ప్రొద్దుటూరు:
పండగల పేరుతో ప్లాస్టిక్ వినియోగించి పర్యావరణానికి ముప్పు కలిగిస్తే ఉపేక్షించేది లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యంగా పురపాలక సంఘం చేపట్టిన నో ప్లాస్టిక్ ఉద్యమం 50 రోజులుగా కొనసాగుతోందని తెలిపారు.పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు చేస్తున్న కృషికి ప్రజల నుంచి కూడా మంచి సహకారం లభిస్తోందన్నారు. అయితే పండగల సమయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచి ఈ ఉద్యమానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ప్లాస్టిక్ నివారణ ఒక పుణ్యకార్యమని, నేడు మనం తీసుకునే పర్యావరణహిత నిర్ణయాల ఫలాలను భవిష్యత్తులో మన పిల్లలు అనుభవిస్తారని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ పట్టణంలోని పలు దుకాణాలను స్వయంగా పరిశీలించారు. ప్లాస్టిక్ కవర్లు, నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని విక్రయదారులను హెచ్చరించారు.“పండగల ఆనందం పర్యావరణానికి భారంగా మారకూడదు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి” అని కమిషనర్ సూచించారు.
