SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 10:51 pm Posted by : SALAM PRODDATUR

స్థానిక సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా

 

జనసేన నాయకుడు మాదాసు మురళి హామీ

 

సలాం ప్రొద్దుటూరు:

పట్టణంలోని శ్రీనివాసపురం ప్రాంతంలో నెలకొన్న రహదారి, డ్రైనేజీ సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి హామీ ఇచ్చారు.శనివారం శ్రీనివాసపురం ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు దరిశ వీరనారాయణ, స్కాలర్స్ బాలసుబ్బారెడ్డి, కందుకూరి భాష తదితరులు మాదాసు మురళిని కలిసి తమ సమస్యలను వివరించారు.

 

20 ఏళ్లుగా అధ్వానంగా రోడ్డు

శ్రీనివాసపురం ప్రధాన రహదారి సుమారు 20 ఏళ్లుగా సరైన నిర్వహణ లేక అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో స్కాలర్స్ స్కూల్, భాష్యం స్కూల్‌తో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయని, ప్రతిరోజూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో గుంతలు ఏర్పడి తరచూ విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వర్షాలు కురిసిన సమయంలో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని పేర్కొన్నారు.

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరిన స్థానికులు

ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేదని స్థానికులు జనసేన నాయకుడి దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీలపై జరిగిన ఆక్రమణలను తొలగించి, కాలువలను పునరుద్ధరించి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళ్తాం

ఈ సందర్భంగా మాదాసు మురళి మాట్లాడుతూ శ్రీనివాసపురం రహదారి, డ్రైనేజీ సమస్యలను ముందుగా స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అవసరమైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే వరకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ప్రాంతంలో మరిన్ని సమస్యలు ఉంటే నందిని క్లాత్ మార్కెట్‌లోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చని, లేదా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ద్వారా కూడా సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని మాదాసు మురళి సూచించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అల్లం చంద్రశేఖర్, రవిశంకర్ రెడ్డి, జనసేన యువజన నాయకులు వరికూటి నాగార్జున, హరీష్ తదితరులు పాల్గొన్నారు.