–బీసీల హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించాలి: డా. వి.ఎస్. ముక్తియార్
సలాం ప్రొద్దుటూరు –విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందిస్తున్న ముసాయిదా బీసీ రక్షణ బిల్లుపై విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో షేక్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీల రక్షణ, హక్కులు, సంక్షేమం, సామాజిక, ఆర్థిక అభ్యున్నతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. బీసీలపై వివక్ష, అన్యాయం, దాడులు జరిగిన సందర్భాల్లో బాధితులకు బలమైన చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ న్యాయం అందేలా బీసీ రక్షణ బిల్లు మరింత పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని డా. ముక్తియార్ సూచించారు.అదేవిధంగా బీసీ యువతకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచే విధంగా విధానాలు రూపొందించాలని కోరారు. బీసీల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.బీసీల హక్కుల పరిరక్షణతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గౌరవం, ఆర్థిక అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని డా. ముక్తియార్ సూచించారు. బీసీల సమగ్ర అభ్యున్నతి కోసం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.“బీసీల హక్కులకు అండగా.. బీసీల రక్షణకు కవచంగా.. బీసీల సంక్షేమం, అభివృద్ధికి దిశానిర్దేశంగా ఎప్పుడూ ముందుండేది తెలుగుదేశం పార్టీనే” అని డా. వి.ఎస్. ముక్తియార్ పేర్కొన్నారు.
