–ప్రముఖ స్త్రీ వ్యాధి వైద్య నిపుణురాలు డాక్టర్ జ్యోతి
–21 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు
– సురక్షిత ప్రసవాలపై అవగాహన
సలాం ప్రొద్దుటూరు :
కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 21 మంది గర్భిణులు కార్యక్రమానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డా. శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించుకోవాలని తెలిపారు. తల్లి, బిడ్డ ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.స్త్రీ వ్యాధుల నిపుణురాలు డా. జ్యోతి గర్భిణులందరినీ పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా తగిన సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో రక్తపరీక్షలు, రక్తపోటు (బీపీ), హిమోగ్లోబిన్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణులందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవం పొందేలా అవగాహన కల్పించారు.అత్యవసర సమయాల్లో 108 ద్వారా ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని వైద్య సిబ్బంది వివరించారు. ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా హిమోగ్లోబిన్ తదితర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన గర్భిణులకు బొందల లక్ష్మీదేవి భోజన వసతిని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డీహెచ్ఈఓ శోభారాణి, సూపర్వైజర్ బి.ఏ. వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ మధు, ఫార్మసీ ఆఫీసర్ సురేంద్ర, ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్, స్టాఫ్ నర్స్ రాధ, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఏఎన్ఎం యశోదతో పాటు ఆరోగ్య సిబ్బంది దీప్తి, ప్రతిమ, రాముడు, బాలు, ఆశా కార్యకర్తలు ప్రభావతి, వీరనారాయణమ్మ పాల్గొన్నారు.
