SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 6:22 pm Posted by : SALAM PRODDATUR

ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడమే “చల్లా ధ్యేయం”

 

–చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం..

–దాదాపు వెయ్యి మందికి భోజన వితరణ

 

సలాం ప్రొద్దుటూరు:

ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప మానవతా సేవ మరొకటి లేదనే సందేశాన్ని చాటుతూ ప్రొద్దుటూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం కొర్రపాడు రోడ్డులోని పాత బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమాన్ని సేవాభావంతో నిర్వహించారు.శనివారం సందర్భంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు వెయ్యి మందికి రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని నిర్వాహకులు అందించారు. స్వీట్ కేసరి, వైట్ రైస్, ఆకుకూర పప్పు, పెరుగు అన్నం, టమాటా చట్నీ తదితర వంటకాలతో భోజనాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా భోజనం స్వీకరించిన పలువురు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరమైన వారికి ఆహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు.‘సేవే సమాజానికి బలం’ అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం స్థానికంగా మానవతా విలువలను చాటిచెప్పింది. రాజకీయ, సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని పలువురు తెలిపారు.