–ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణకు విశేష కృషి
–12న కడపలో సంస్మరణ సభ
— ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం
సలాం ప్రొద్దుటూరు:
భారత కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి నాయకుడిగా, ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణకు, సామాజిక న్యాయం సాధనకు కామ్రేడ్ సీతారాం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కడప జిల్లా కార్యదర్శి ఎస్. ముంతాజ్ బేగం అన్నారు.సీతారాం ఏచూరి రాజకీయ జీవితం, ప్రజా ఉద్యమాలకు ఆయన అందించిన సేవలు, దేశ నిర్మాణంపై ఆయన ఆలోచనలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 12న ఉదయం 10 గంటలకు కడపలోని ఐక్య ఉపాధ్యాయ భవన్లో సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక న్యాయ విలువలను బలంగా వినిపించిన నాయకుడిగా సీతారాం ఏచూరి తనదైన ముద్ర వేశారని ఆమె పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సామాన్య ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సంస్మరణ సభకు ప్రజాస్వామ్యవాదులు, మహిళలు, ప్రజా ఉద్యమాల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్. ముంతాజ్ బేగం పిలుపునిచ్చారు.
