SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 3:17 pm Posted by : SALAM PRODDATUR

ప్రజా తీర్పు గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది!

 

–చంద్రబాబు పోరాట స్ఫూర్తిని స్మరించుకున్న టీడీపీ శ్రేణులు

 

–కడప పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో కొవ్వొత్తుల కార్యక్రమం

 

సలాం ప్రొద్దుటూరు కడప:

 

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ కడప జిల్లా పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ కమిటీ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా గతంలో ఎదురైన రాజకీయ పరిణామాలను గుర్తుచేసుకుంటూ, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు నివాళులర్పించారు.

టీడీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఎస్ జాబివుల్లా మాట్లాడుతూ.. ఆ చీకటి రోజుల్లో ఎన్నో కష్టాలు, ఆవేదనకర పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గలేదన్నారు. నాయకత్వంపై విశ్వాసంతో కార్యకర్తలు ఐక్యంగా నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగించారని తెలిపారు.

కొవ్వొత్తుల వెలుగులు కేవలం ఒక కార్యక్రమానికి ప్రతీక కాదని.. నిజం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చివరకు ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారని, ప్రజా తీర్పును మించిన శక్తి మరొకటి లేదని అన్నారు.

“చీకటి ఎంత ఉన్నా వెలుగు తప్పదు.. అన్యాయం ఎంతకాలం కొనసాగినా న్యాయం గెలుస్తుంది.. చివరకు ప్రజా తీర్పే గెలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

కష్టకాలంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఈ రోజు ఒక భావోద్వేగమైన జ్ఞాపకమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబం ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పార్లమెంట్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ సంఘీభావాన్ని తెలిపారు.