
–‘విశ్వ నాట్య రత్న’, ‘భారతీయ నాట్య రత్న’ అవార్డులతో ఘన సత్కారం
సలాం ప్రొద్దుటూరు–హైదరాబాద్:
ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ నటరాజ కళాక్షేత్రం గురువులు, విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏఎస్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురువులకు వందనం’ కార్యక్రమంలో వారికి ఘన సత్కారం లభించింది.ఈ సందర్భంగా నటరాజ కళాక్షేత్రం నాట్యగురువులు పఠాన్ మొహిద్దీన్ ఖాన్, పఠాన్ సొహైల్ ఖాన్, పి. మిత్రవిందలకు నృత్యరంగానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘విశ్వ నాట్య రత్న’ అవార్డులను ప్రదానం చేసి శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.అలాగే కళాక్షేత్రం విద్యార్థులు జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జానపద నృత్యాన్ని మదీహ, గీర్వాణి, హన్విత, శాన్విత, కీర్తన ప్రియ ప్రదర్శించగా, శాస్త్రీయ నృత్యాన్ని రుత్విక, సిసిర, ఆశ్రిత, మేఘన, ప్రజ్ఞ, మునిశ్రావ్య ప్రదర్శించారు. వారి ప్రతిభను గుర్తిస్తూ ‘భారతీయ నాట్య రత్న’ అవార్డులతో సత్కరించారు.ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని శ్రీ నటరాజ కళాక్షేత్రం ద్వారా సంప్రదాయ నృత్యకళలను ప్రోత్సహిస్తూ, యువతరానికి శిక్షణ అందిస్తున్న గురువులకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం పట్ల కళాభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు కళాక్షేత్రానికి, ప్రొద్దుటూరుకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చాయని పేర్కొన్నారు.అవార్డులు అందుకున్న గురువులు, విద్యార్థులను పలువురు కళాకారులు, సాంస్కృతిక ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
