
–రేషన్ కార్డుదారులకు 14 రకాల సరుకులు అందించాలి
–ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ డిమాండ్
సలాం ప్రొద్దుటూరు –కడప:
నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి పేదలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
కడపలో నిర్వహించిన ధర్నాలో ఐద్వా నాయకులు, మహిళలు పాల్గొని నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరల కారణంగా పేద కుటుంబాలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని ముంతాజ్ పేర్కొన్నారు.
కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, రాష్ట్రంలోని ప్రతి రేషన్ కార్డుదారుడికి 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ వ్యవస్థ ద్వారా అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.నిత్యావసర సరుకుల ధరల నియంత్రణతో పాటు రేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి పేదలకు అవసరమైన సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముంతాజ్ ప్రభుత్వాన్ని కోరారు.
