SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 3:54 pm Posted by : SALAM PRODDATUR

టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

 

–స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం

 

సలాం ప్రొద్దుటూరు అమరావతి:

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ కాంక్లేవ్‌ సోమవారం ప్రారంభమైంది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో శిక్షణ, ఇంటరాక్టివ్‌ విధానంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

 

కాంక్లేవ్‌లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకత్వ లక్షణాల పెంపొందింపు, క్షేత్రస్థాయిలో క్యాడర్‌తో సమన్వయం, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

 

రెండు రోజులపాటు మొత్తం 10 కీలక అంశాలపై మేధోమథనం నిర్వహించనున్నారు. రాబోయే మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉంటూ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.

 

కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో పాటు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు భూపేష్‌ రెడ్డి, రాష్ట్ర షేక్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డా. వీఎస్‌ ముక్తియార్‌, ఎమ్మెల్యేలు పుత్తా చైతన్యరెడ్డి, మాధవరెడ్డి, బద్వేల్‌ టీడీపీ ఇన్‌చార్జి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.