సలాం ప్రొద్దుటూరు – కడప:
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. లక్ష్మీనారాయణ (హెచ్సీ-1180) కుటుంబానికి పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీసు వితరణ నిధి నుంచి ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దివంగత హెడ్ కానిస్టేబుల్ సతీమణి ఎం. రమణమ్మకు రూ.2.5 లక్షల చెక్కును ఎస్పీ అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంకితభావంతో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో డీపీఓ ఏఓ నిజాముద్దీన్, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, సూపరింటెండెంట్లు శ్రీనివాస నాయక్, సురేష్, క్లర్కులు ఆనంద్, డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.