SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 4:31 pm Posted by : SALAM PRODDATUR

రూ.12 కోట్లతో 50 అభివృద్ధి పనులు

 

–ప్రొద్దుటూరు పట్టణంలో డ్రైన్లు, పైప్‌లైన్లు, రోడ్ల అభివృద్ధికి శ్రీకారం

 

–సెప్టెంబర్ 6న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

 

సలాం    ప్రొద్దుటూరు:

పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణ చేపట్టారని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటికి పరిపాలనాపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

 

ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పైప్‌లైన్ల పునరుద్ధరణ, రహదారుల అభివృద్ధి తదితర మౌలిక వసతులకు సంబంధించి ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకువచ్చారని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన పరిపాలన, సాంకేతిక అంచనాలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారని తెలిపారు.

 

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రూ.12 కోట్ల నిధులతో మొత్తం 50 అభివృద్ధి పనులకు పరిపాలన ఆమోదం లభించిందని కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ వెల్లడించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు.

 

సెప్టెంబర్ 6, ఆదివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో ఈ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టామని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

 

ప్రజల నుంచి వచ్చే సమస్యలను గుర్తించి వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడంతో పాటు, పట్టణంలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.