SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 10:59 am Posted by : SALAM PRODDATUR

“రాచమల్లు బీసీ వ్యతిరేకి కాదు.. బీసీలకు అండగా నిలిచిన నాయకుడు!”

 

–బీసీలపై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి ఉన్న నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు

 

–రాజకీయ విభేదాలను బీసీ సమస్యగా చిత్రీకరించడం సరికాదు–పండిటి కాశయ్య

సలాం   ప్రొద్దుటూరు:

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బీసీలను కించపరిచేలా మాట్లాడారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రజక విభాగం అధ్యక్షుడు పండిటి కాశయ్య ఖండించారు. రాచమల్లు బీసీ వ్యతిరేకి కాదని, బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అండగా నిలిచిన నాయకుడని స్పష్టం చేశారు.

 

గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బీసీలను తక్కువ చేసి మాట్లాడారంటూ ప్రచారం జరుగుతోందని కాశయ్య తెలిపారు. దీనికి ప్రధానంగా చల్లా రాజగోపాల్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలే కారణమని ఆయన పేర్కొన్నారు.

 

రాజగోపాల్‌ యాదవ్‌ను రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గతంలో సోదరుడిగా భావించారని కాశయ్య గుర్తుచేశారు. “ఏక గర్భంలో జన్మించకపోయినా మనం అన్నదమ్ములమే” అని వేలాది మంది సమక్షంలో రాచమల్లు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు రాచమల్లు గురించి విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు.

 

“రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని రాజకీయంగానే పరిష్కరించుకోవాలి. వాటిని బీసీలకు సంబంధించిన వివాదంగా మార్చడం సరికాదు” అని కాశయ్య పేర్కొన్నారు.

 

చర్చకు సిద్ధం

 

రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి బీసీలపై ప్రేమ లేదంటూ కొందరు బీసీ సంఘాల పేరుతో సమావేశాలు నిర్వహించి మాట్లాడుతున్నారని కాశయ్య అన్నారు. రాచమల్లు బీసీల కోసం చేసిన కార్యక్రమాలు, వారికి కల్పించిన రాజకీయ ప్రాధాన్యతపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

“రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి బీసీలపై ఎంత ప్రేమ ఉందో బీసీలపై ఎంత నిబద్ధత ఉందో చర్చా వేదిక ఏర్పాటు చేస్తే ఆధారాలతో మాట్లాడతాం” అని ఆయన సవాల్‌ చేశారు.

 

బీసీలను ఒక కుటుంబంలా భావిస్తూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వారికి అండగా నిలిచారని కాశయ్య పేర్కొన్నారు. బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారని తెలిపారు.

 

“ఈ నియోజకవర్గంలోనే కాదు.. కడప జిల్లాలో, రాష్ట్రంలో కూడా బీసీలకు రాచమల్లు ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది” అని కాశయ్య అన్నారు.

 

బీసీల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, బీసీ సమాజ ప్రయోజనాల కోసం నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు.