– బొర్రా రామాంజనేయులు వ్యాఖ్యలపై మాజీ మునిసిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి ఆగ్రహం
సలాం ప్రొద్దుటూరు:
“రాచమల్లు అన్న నన్ను ఎప్పుడూ ‘అమ్మా’ అని గౌరవంగా పిలుస్తారు.. మీరు మాత్రం నన్ను ‘బొమ్మ’ అంటున్నారు. మహిళల పట్ల ఇదేనా మీ గౌరవం?” అని ప్రొద్దుటూరు మాజీ మునిసిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి ప్రశ్నించారు.
తనకు మునిసిపల్ చైర్మన్ పదవి లభించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, తనను బీసీ మహిళగా గుర్తించి గౌరవంతో పదవి ఇచ్చారని ఆమె తెలిపారు. పదవిలో ఉన్న సమయంలో తనను కుటుంబ సభ్యురాలిగా భావించి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఎంతో గౌరవంగా చూసుకున్నారని పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితుల్లో తనను ‘బొమ్మ’గా అభివర్ణించడం తీవ్రంగా బాధించిందని లక్ష్మీదేవి అన్నారు. రాజకీయ విమర్శలు చేయడానికి ఎవరికైనా హక్కు ఉందని, అయితే మహిళలను కించపరిచేలా మాట్లాడటం మాత్రం రాజకీయ సంస్కారం కాదని స్పష్టం చేశారు.
“పదవి ఇచ్చినంత మాత్రాన ఒక మహిళను బొమ్మగా చూడరు. ప్రజలకు సేవ చేసే బాధ్యతను అప్పగిస్తారు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. ఇకపై ఏ మహిళపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలి” అని ఆమె హితవు పలికారు.