SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 10:06 am Posted by : SALAM PRODDATUR

“బీసీలకు పెద్దపీట వేసింది రాచమల్లు శివప్రసాద్‌రెడ్డే”

–సగర కులస్తుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి

–వైఎస్సార్‌సీపీ సగర కులస్తుల సంఘం నేత మురళీధర్

 

సలాం ప్రొద్దుటూరు:

 

బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేసి, అనేక పదవులు కల్పించి ప్రోత్సహించిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ సగర కులస్తుల సంఘం నేత మురళీధర్ అన్నారు.

తనకు రాజకీయ పరిజ్ఞానం వచ్చినప్పటి నుంచి, తాను చూసిన అనేక ఎన్నికలు, రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే బీసీలకు ప్రాధాన్యత కల్పించిన వారిలో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ముందుంటారని మురళీధర్ పేర్కొన్నారు. చంద్రన్న హయాం నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు పరిశీలిస్తే, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హయాంలోనే బీసీలకు అనేక నామినేటెడ్ పదవులు లభించాయని తెలిపారు. సుమారు పది నుంచి పన్నెండు మంది వరకు కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు చైర్మన్ పదవులు కూడా బీసీలకు దక్కాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీ పార్టీ బీసీ లు బీసీలకు అన్యాయం జరిగిందనే అంశంతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదని మురళీధర్ అభిప్రాయపడ్డారు. బీసీలు రాజకీయంగా ముందుకు రావాలంటే ఆయా పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుని మరిన్ని పదవులు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన బీసీల అభ్యున్నతిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

సగర కులస్తులపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి

గతం లో  ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో సగర కులస్తులను ఉద్దేశించి దుర్భాషలాడారని మురళీధర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా ఉన్న సగర కులస్తులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, సంబంధిత నాయకుడిని ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆ సమయంలో సగర కులస్తుల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఏడుకొండల ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన, ఘెరావ్ నిర్వహించి వివరణ కోరినా క్షమాపణ చెప్పలేదని మురళీధర్ తెలిపారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు ఈ అంశాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.

సగర కులస్తులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ, కుల గౌరవానికి సంబంధించిన అంశాల్లో ఐక్యంగా స్పందించాలని ఆయన కోరారు. సగర కులస్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బాధ్యులు స్పందించి, తమ కులానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మురళీధర్ డిమాండ్ చేశారు.