–ప్రజల సలహాలు, సూచనలకు సెప్టెంబర్ 11 వరకు అవకాశం

సలాం ప్రొద్దుటూరు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రొద్దుటూరు పురపాలక సంఘంలోని వార్డుల పునర్విభజనకు తాజా షెడ్యూల్ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతమున్న 41 ఎన్నికల వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్.ఓ.సి. నెం.13032/2/2026/H1-2, తేదీ 04.09.2026 ద్వారా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు WP.No.15782/2026 మరియు బ్యాచ్ కేసుల్లో 03.09.2026న జారీ చేసిన ఉమ్మడి ఉత్తర్వులకు అనుగుణంగా వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ (నగర పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను వార్డులుగా విభజించడం) నిబంధనలలోని రూల్ 4(1), జి.ఓ.ఎం.ఎస్. నెం.31 ప్రకారం ఫారం-1 నోటిఫికేషన్ను ప్రజల పరిశీలన, సలహాలు మరియు సూచనల కోసం ప్రచురించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 11లోపు అభ్యంతరాలు, సూచనలు
ఫారం-1 నోటిఫికేషన్ ప్రతులను కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం, జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంతో పాటు ప్రొద్దుటూరులోని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రజల పరిశీలన కోసం ఉంచారు.
వార్డుల పునర్విభజనపై ప్రజలకు ఏవైనా సలహాలు, సూచనలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని 2026 సెప్టెంబర్ 11వ తేదీలోపు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
ప్రజల నుంచి అందే సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.