SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 2:28 pm Posted by : SALAM PRODDATUR

ఏపీలో స్థానిక ఎలక్షన్ సమరానికి ముందడుగు.. మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్

 

సలాం ప్రొద్దుటూరు :

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల హద్దులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ టైమ్‌లైన్ రూపొందించింది. మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో దశలవారీగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 26 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 3ను గడువుగా నిర్ణయించారు. పార్వతీపురం, సాలూరు, నర్సీపట్నం, విజయవాడ, రామచంద్రాపురం, జగ్గయ్యపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, మార్కాపురం, చీరాల, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర పట్టణాలు ఇందులో ఉన్నాయి.

 

తొలి విడతలో తిరుపతి సహా మరిన్ని పట్టణాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రొద్దుటూరు, రాయచోటి, రాయదుర్గం, పుట్టపర్తి, బద్వేల్, నగరి, పుత్తూరు, కదిరి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, పలమనేరు, తిరుపతి వంటి పట్టణాల్లోనూ సెప్టెంబర్ 3 నాటికి వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్‌లో పేర్కొన్నారు

 

 

రెండో దశలో సెప్టెంబర్ 8 కీలకంగా మారింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఏలూరు, మచిలీపట్నం, పెడన, పిఠాపురం, ఒంగోలు, గుంటూరు, కడప, ధర్మవరం, తాడిపత్రి, నంద్యాలల్లో ఆ తేదీ నాటికి డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇక మూడో దశలో చిలకలూరిపేట, నెల్లూరు పట్టణ స్థానిక సంస్థల్లో సెప్టెంబర్ 15 నాటికి వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో 39 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేసేలా మున్సిపల్ శాఖ కార్యాచరణ రూపొందించింది

 

సెప్టెంబర్ 3, 8, 15.. మూడు కీలక తేదీలు

 

మొత్తంగా 39 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయాలని షెడ్యూల్ ఖరారైంది. తొలి దశకు సెప్టెంబర్ 3, రెండో దశకు సెప్టెంబర్ 8, చివరి దశకు సెప్టెంబర్ 15ను గడువుగా నిర్ణయించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవుతున్న కొద్దీ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో తదుపరి ప్రక్రియలకు మార్గం సుగమం కానుంది.